ఈ ఏడాది జనవరిలో హత్యకు గురైన పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసుకు సంబంధించి ఒక్కో చిక్కుముడి వీడుతోంది.హత్యతో జయరామ్ మేనకోడలు శిఖాకు కూడా సంబంధం ఉండొచ్చిన అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టి చివరగా జయరామ్ హత్యతో శిఖాకు ఎటువంటి సంబంధం లేదని తేల్చారు.అయితే శిఖాపై పెట్టిన ఖర్చును తిరిగి రాబట్టుకోవడానికి నిందితుడు రాకేశ్రెడ్డి జయరామ్ను లక్షంగా చేసుకున్నాడని పోలీసులు తేల్చారు. శిఖా చౌదరితో పరిచయం ఏర్పరుచుకున్న రాకేశ్రెడ్డి శిఖాతో కొంత కాలం పాటు సహజీవనం చేశాడు. ఈ సమయంలో ఆమెపై లక్షల రూపాయాలను ఖర్చు చేశాడు. కొంత కాలానికి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి.అయితే విడిపోయిన అనంతరం శిఖా చౌదరి రాకేశ్పై తప్పుడు ప్రచారం చేయడంతో శిఖాపై కక్ష పెంచుకున్న రాకేశ్ ఖర్చు చేసిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలంటూ శిఖాను డిమాండ్ చేయగా అందుకు శిఖా నిరాకరించింది.దీంతో శిఖా నుంచి ఎలాగైనా డబ్బులు రాబట్టుకోవాలనే ఉద్దేశంతో శిఖా గురించి ఆరా తీసిన రాకేశ్కు జయరామ్ గురించి తెలిసింది.దీంతో జయరామ్, శిఖా చౌదరి ఇళ్ల వద్ద తన మనుషులను ఏర్పాటు చేసుకొన్నాడు. జయరామ్ అమెరికా నుండి ఇండియాకు వచ్చిన వెంటనే రాకేష్ రెడ్డి ప్లాన్ చేసి అతడిని కిడ్నాప్ చేశారని పోలీసులు చార్జీషీట్లో ప్రస్తావించారు.హానీట్రాప్ ద్వారా జయరామ్ను కిడ్నాప్ చేశారు. జయరామ్ను చిత్రహింసలకు గురి చేసే సమయంలో జయరామ్కు తెలియకుండానే వీడియాలను చిత్రీకరించారు. ఈ వీడియోలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ విషయాన్ని కూడా పోలీసులు చార్జీషీట్లో ప్రస్తావించారు. తనకు ఆరోగ్యం బాగాలేదు ఆసుపత్రికి తీసుకెళ్లాలని జయరామ్ ప్రాధేయపడినా కూడ రాకేష్ రెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్లలేదని కూడ పోలీసులు చార్జీషీట్లో రాశారు. తన వద్ద రూ.4.5 కోట్లను జయరామ్ అప్పుగా తీసుకొన్నాడని కూడా రాకేష్ రెడ్డి బాండ్ రాయించుకొన్నాడు. బాండ్ పై జయరామ్ సంతకాలు చేసే దృశ్యాలు కూడ పోలీసులు సేకరించారు. ఈ విషయాలను పోలీసులు చార్జీషీట్లో పేర్కొన్నారు.జయరామ్ హత్య కేసులో ఏ1 గా రాకేష్ రెడ్డి, ఏ2 విశాల్ పేర్లతో సహా తయారు చేసిన 23 పేజీల చార్జీషీట్ను కోర్టులో సమర్పించారు.