అమరావతి : పోలవరం రీటెండర్కు సంబంధించి రేపు నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. నవంబరు ఒకటో తేది నుంచి ప్రాజెక్టు పనులు కచ్చితంగా ప్రారంభమవుతాయన్నారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ వ్యక్తం చేసిన అభ్యంతరాలకు ప్రభుత్వం ఇప్పటికే సమాధానం ఇచ్చిందని వెల్లడించారు. అంచనాలు, ప్రాజెక్టు నిర్మాణ సమయంపైనే అథారిటీ ఆందోళన వ్యక్తం చేసిందన్నారు. రీటెండర్తో ప్రాజెక్టు వ్యయం తగ్గుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఇంకా రూ.35 వేల కోట్లు అవసరమవుతాయని, ఇందులో రూ.30 వేల కోట్లు పునరావాసానికే సరిపోతుందని ఆయన వివరించారు.