పుణె : ఇందాపుర్ మండలం కడ్బన్వాడీలో సోమవారం ఉదయం పదకొండున్నర గంటల సమయంలో చిన్న విమానం కూలటంతో పైలట్ శిక్షణ పొందుతున్న భావనా రాఠోడ్(22) స్వల్ప గాయాలతో బయట పడింది. ఒక ప్రైవేటు ఏవియేషన్ స్కూల్లో భావనా రాఠోడ్ పైలెట్గా తర్ఫీదు పొందుతున్నారు. బారామతి విమానాశ్రయంలో బయలుదేరిన విమానం కాసేపటికే పొలంలో కూలిపోయింది. విమానం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. విమానం కూలటంతో భారీ శబ్దం వచ్చింది. దీంతో చుట్టు పక్కల ప్రజలు ఉలిక్కిపడ్డారు. కాసేపటికి తేరుకుని సంఘటనా స్థలానికి పరుగెత్తారు. గాయపడ్డ ట్రైనీ పైలట్ భావనకు ప్రాథమిక చికిత్స చేసాక స్థానిక ఆస్పత్రికి తరలించారు. విమానంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్-డీజీసీఏ ఓ ప్రకటనలో తెలిపింది.