వరంగల్ : కాన్వెంట్ చదువుల కోసం ఎగబడుతున్న ఈరోజుల్లో ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను ఓ పంచాయతీ గుర్తించింది. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామ పంచాయతీ, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను ప్రోత్సహించే దిశగా బృహత్తర తీర్మానం చేసింది. సర్పంచ్ మాడ్గుల కొమురయ్య, కొత్త జడ్పీటీసీ సభ్యుడు వంగ రవీందర్ల నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపించని కుటుంబాలకు గ్రామ పంచాయతీ ధ్రువ పత్రాలు ఇవ్వబోదని పంచాయతీ తీర్మానం చేశారు. ప్రభుత్వ పథకాలు కూడా వర్తించవని తీర్మానంలో పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రైవేట్ పాఠశాలల వాహనాలను గ్రామంలోకి అనుమతించబోమని కూడా స్పష్టం చేశారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు సర్కారు బడిలో చదవని విద్యార్థులకు గ్రామ పంచాయతీ తరఫున ఎలాంటి ధ్రువ పత్రాలు ఇవ్వబోమని ఇంటింటా ప్రచారం చేశారు.