బెంగళూరు : ప్రస్తుత కంప్యూటర యుగంలో అనుకున్నదే తడవుగా ఘుమఘుమలాడే వంటకాలు ఇంటి ముంగిట వాలిపోతాయి. అయితే లెక్కలేనంత మంది సర్వీస్ ప్రొవైడర్లలో ఎవరిని ఎంచుకోవాలో తెలియక కస్టమర్లు తికమకపడిపోతుంటారు. అలాంటి వారి కోసం నగరానికి చెందిన స్టార్టప్ కంపెనీ హాపియెంట్ కొత్త ఆన్లైన్ ప్లాట్ఫాం…ఒహియో (OHIEO)ను ఆవిష్కరించింది. దీని ద్వారా బెంగళూరు నగరంలోని 300కు పైగా కిచెన్ల నుంచి లభ్యమయ్యే ఆహార పదార్థాలను నిముషాల్లో ఆర్డర్ చేసుకోవచ్చు. హాపియెంట్ ఇన్ఫో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకులు అమిత్ వ్యాస్, ఎన్టీ. ప్రసాద్లు దీని రూపశిల్పులు. ఈ ప్లాట్ఫాం ద్వారా అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలతో పాటు మనకు నచ్చిన వంటకాలను ఆర్డరిచ్చి పొందవచ్చని వారు వెల్లడించారు. ఏక కాలంలో 25 మంది నుంచి 6000 మంది వరకు అవసరమయ్యే దేశీయ, అంతర్జాతీయ వంటకాలను సమకూరుస్తారు. మెనూను ఎంపిక చేసుకోవడంతో పాటు వివిధ సేవలను, ధరలను పోల్చుకుని ఆహారాన్ని బుక్ చేసుకోవడంతో పాటు ఈ సైట్ ద్వారానే చెల్లింపులు కూడా చేయవచ్చని వారు వివరించారు. కస్టమర్ల నుంచి ఆర్డర్ తీసుకున్న వ్యక్తి టేబుళ్లు ఏర్పాటు చేయడం మొదలు, వంటకాలను సరఫరా చేయడం, వడ్డించడం వరకు అన్ని సేవలను చూసుకుంటాడని తెలిపారు.