సాధారణంగా చైన్ స్నాచింగ్ ముఠాలు మహిళలను మాత్రమే లక్ష్యంగా నిర్దేశించుకొని చైన్స్నాచింగ్లకు పాల్పడుతుంటారు.అయితే హైదరాబాద్ నగరంలో తిష్ట వేసిన ఓ చైన్స్నాచింగ్ ముఠా మాత్రం ఇతర చైన్స్నాచింగ్ ముఠాలకు భిన్నంగా మహిళలు కాకుండా పురుషులను లక్ష్యంగా నిర్దేశించుకొని చైన్స్నాచింగ్లకు పాల్పడుతుండడం వెలుగులోకి వచ్చింది.మల్లేపల్లిలోని అఫ్జల్సాగర్కు చెందిన కాంబ్లె అలియాస్ శ్యామ్సుందర్ అదే ప్రాంతానికి చెందిన రాజు,లక్కి,సాయికుమార్,అరుణ్రాజ్,గీతాభరత్లతో పాటు మరో నలుగురు సహచరులతో కలసి ముఠాగా ఏర్పడి చైన్స్నాచింగ్లకు తెగబడుతున్నారు.తొమ్మిది మంది సభ్యులున్న ముఠాలో ముందుగా ఐదు మంది రద్దీగా ఉండే బస్సు ఎక్కుతారు.అందులో తూకం ఎక్కువ ఉండే గోలుసు ఉన్న వ్యక్తిని లక్ష్యంగా చేసుకుంటారు.అనతంరం లక్ష్యంగా నిర్దేశించుకున్న వ్యక్తి ముందు ఇద్దరు,వెనుక ఇద్దరు నిలబడగా మరొక సభ్యుడు వ్యక్తి గొలుసు తెంపడానికి సిద్ధమవుతాడు.ఇక్కడే తమ అసలు పథకాన్ని అమలు చేస్తారు నిందితులు.ముందు నుంచి వెనుక నుంచి లక్ష్యంగా నిర్దేశించుకున్న వ్యక్తిని ఊపిరి సలపనంత ఒత్తిడికి గురి చేస్తారు.ఈ పెనుగులాటలో ఉండగానే వెనుక ఉన్న ముఠా సభ్యుడు గొలుసును పళ్లతో కొరికి వదులు చేసి బస్సు కుదుపులకు లోనయ్యే సమయంలో గొలుసు లాగేస్తాడు.పని ముగిసిన అనంతరం ఐదు మంది ఒకే బస్టాప్లో దిగిపోతారు.ఇలా నిందితులు చైన్స్నాచింగ్లకు పాల్పడుతుండడంపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో బాధితులు తెలిపిన వివరాలతో స్కెచ్లు గీయించి,ఫోటోలు తీయించి బస్టాప్లలో అతికించారు.దీంతో నిందితులు లక్డీకాపూల్లో ఉన్నట్లు సమాచారం అందుకున్న సైఫాబాద్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని చైన్స్నాచింగ్ సభ్యులకు తెలియకుండా బస్సు ఎక్కి వారితో పాటు ప్రయాణించి సైఫాబాద్ పోలీస్స్టేషన్ రాగానే సభ్యులను అరెస్ట్ చేశారు.అరెస్టయిన నిందితుల్లో ముఠా నాయకుడు కాంబ్లె అలియాస్ శ్యామ్సుందర్ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.గతంలో కాంబ్లెపై 22 కేసులు నమోదయ్యాయని ఏడాది జైలు శిక్ష కూడా అనుభవించాడని పోలీసులు తెలిపారు.ఇప్పటి వరకు ముఠా మెహదీపట్నం,లక్డీకాపూల్,బంజారాహిల్స్,నాంపల్లి,సైఫాబాద్,నారాయణగూడ తదితర ప్రాంతాల్లో పదికిపైగా చైన్స్నాచింగ్లకు పాల్పడ్టట్లు పోలీసులు గుర్తించారు..