న్యూఢిల్లీ : ప్రతిపక్ష కూటమిపై కేవలం 84,900 ఓట్ల తేడాతోనే బీహార్లో ఎన్డిఎ ప్రభుత్వం అధికారం చేపట్టిందని ఒక సర్వే తేల్చింది. మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. ఎన్డిఎకి, ఆర్జెడి, కాంగ్రెస్, వామపక్షాల మహాఘట్బంధన్కు మధ్య మొత్తం తేడా కేవలం 0.2 శాతమే. నితీష్ కుమార్ వరుసగా నాలుగో సారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టనున్నారు. తుది ఫలితాల ప్రకారం.. ఎన్డిఎ కూటమిలోని బిజెపి 74 స్థానాల్లో పోటీ చేయగా.. 82,01,298 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. నితీష్కుమార్కి చెందిన జనతాదళ్ (యునైటెడ్)కి కేవలం 43 సీట్లలో మాత్రమే విజయం సాధించగా.. 64,84,414 ఓట్లు దక్కాయి. మహాఘట్బంధన్లోని కాంగ్రెస్ 2015లో 27 స్థానాలను గెలుచుకోగా, ఈ ఎన్నికల్లో 19 స్థానాలకు పడిపోయింది. ఈ పార్టీకి 39,94,912 ఓట్లు లభించాయి. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 75 స్థానాలతో అత్యధిక సీట్లు సాధించి రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి) 96,63,584 ఓట్లను సాధించింది. సిపిఐ-ఎంఎల్ 11 సీట్లు గెలుచుకుని ..12,50,869 ఓట్లను పొందింది. సిపిఐ రెండు స్థానాలకు గాను 3,49,489 ఓట్లను, సిపిఎం మూడు స్థానాలకు గాను 3,56,855 ఓట్లను సాధించింది. మాజీ ముఖ్యమంత్రి జితాన్ రామ్ మంజి పార్టీ హెచ్ఎఎంకి నాలుగు సీట్లను మాత్రమే గెలుచుకోగా, 3,75,564 ఓట్లను సాధించారు. మరో నేత ముఖేష్ సాహ్నికి 6,39,342 ఓట్లు లభించాయి.