అడుగడుగునా నీచ రాజకీయాలు

అడుగడుగునా నీచ రాజకీయాలు

మంగళగిరి : ‘చరిత్రలో ఎన్నికలను ఇంత అపహాస్యం చేసిందెన్నడూ లేదు. తప్పుడు పనులు చేస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతార’ని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయు డు హెచ్చరించారు. సోమవారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. ‘‘వైకాపా నేతలు ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? ఇలాగైతే ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితికి వస్తారు. దొంగ ఓట్లు వేయబోతున్నారని ముందే చెప్పాం. మున్సిపల్ ఎన్నికలను కూడా అపహాస్యం చేసిన ఘటనలా? ప్రజా వ్యతిరేకతను కప్పి పుచ్చుకోవడానికి ఇన్ని కుట్రలా? గెలిచామని చెప్పుకోవడానికి అక్రమాలకు పాల్పడుతున్నారు. పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. దొంగలకు వంతపాడేలా పోలీసులు వ్యవహరిస్తున్నారు. కుప్పంలో దొంగ ఓటర్లను రాత్రే తెదేపా నేతలు పట్టుకున్నారు. ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. తెదేపా నేతలను అరెస్టు చేశారు. దొంగ ఓటర్లను వారి కుటుంబ సభ్యులే అసహ్యించుకుంటున్నారు. పోలింగ్ ఏజెంట్లను అరెస్టు చేసి వేరే ప్రాంతాలకు తరలించారు. ఏం చేసినా జరిగిపోతుంద నుకుంటే శిక్ష తప్పదు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాలి. అడుగడుగునా నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. ప్రతి ఘటనపైనా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. ఎన్నికల నిర్వహణ చేతకాకుంటే ఎస్ఈసీ వెళ్లిపోవాలి. ప్రభుత్వాన్నే నిర్వహించుకోవాలని వెళ్లిపోవచ్చు కదా. వైకాపా ఎంపీలు, మేయర్లు, పోలింగ్ కేంద్రాల వద్దకు ఎందుకెళ్లారు? అనధికార వాహనాలను ఎందుకు స్వాధీనం చేసుకో లేదు. ఎందరిని అరెస్టు చేశారో సమాధానం చెప్పాలి. దొంగ ఓటర్లపై పోరాడేవారిపై పోలీసుల లాఠీఛార్జ్ దుర్మార్గం. శాంతి భద్రతల సాకుతో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఇష్టానుసారం చేసి పైశాచిక ఆనందం పొందాలనుకుంటున్నారా?’’ అని ద్వజ మెత్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos