నేచురల్ స్టార్ నాని అభిమానులకు దీపావళి వేడుకలు కాస్త ముందుగానే మొదలయ్యాయి. ఎందుకంటే వాళ్లు ఎదురుచూస్తున్న అనౌన్స్మెంట్ వచ్చేసింది. నాని కథానాయకుడిగా ప్రామిసింగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. నాని కథానాయకుడిగా నటించే ఈ 28వ చిత్రం ఒక ఫ్రెష్ కాన్సెప్ట్తో మ్యూజికల్ రొమాంటిక్ కామెడీగా రూపొందనున్నది. కొన్ని కాంబినేషన్లు ఇన్స్టంట్ క్రేజ్ను తీసుకొస్తాయి. నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ సరిగ్గా అలాంటిదే. ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ సినిమాలతో వివేక్ ఆత్రేయ ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ మూవీలో నాని జోడీగా మలయాళం భామ నజ్రియా ఫహాద్ (నజ్రియా నజీమ్) టాలీవుడ్లోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆమెకు తెలుగు సినీ కుటుంబంలోకి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ సాదర స్వాగతం పలుకుతోంది. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తోన్న ఈ సినిమా ఎనౌన్స్మెంట్ పోస్టర్ ఆహ్లాదకరంగా ఉండి, పాజిటివ్ వైబ్స్ అందిస్తోంది. పోస్టర్ బ్యాగ్రౌండ్లో గమ్యం చేరుకోవడానికి వెళ్తున్న ఒక విమానం, ఒక వీణ, కెమెరాలు, ట్రావెలింగ్ బ్యాగ్ లాంటివి కనిపిస్తున్నాయి. ఈ చిత్రం ఒక ఉత్తేజభరితమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే విషయాన్ని అవి తెలియజేస్తున్నాయి. నవంబర్ 21న టైటిల్ను అనౌన్స్ చేస్తామని ఆ పోస్టర్లో నిర్మాతలు వెల్లడించారు. ఈ రోజు మంచిరోజు కావడంతో సినిమాను ప్రకటించామని వారు తెలిపారు.