అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్కుమార్, చంద్రబాబు లేఖలకు స్పందించి ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘కరోనా తీవ్రత దృష్ట్యా ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఉద్యోగులు సిద్ధంగా లేరు. నిమ్మగడ్డకు రాజ్యాంగ వ్యవస్థలపై, రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదు. చిల్లర రాజకీయాలు చేయకుండా హుందాగా ఉండాలి. ఒక వైపు కరోనా తీవ్రంగా ఉన్నా ఎన్నికలు నిర్వహిస్తామనడం అవివేకం. హైదరాబాద్లో కూర్చొనే అజ్ఞాతవాసి నిమ్మగడ్డ రమేష్. జూమ్ బాబుతో చేతులు కలిపి ప్రజలకు నష్టం కలిగించేలా, ఎన్నికలు నిర్వహిస్తామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోద’ని దుయ్యబట్టారు.