దేశానికి ఎంతో మంది సమర్థవంతమైన నేతలను అందించిన పార్టీ,ఎంతోమంది
ప్రధానులను చేసిన పార్టీ 125 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ
రాష్ట్రంలో ఉనికి కోసం పోరాడాల్సిన దుస్థితికి చేరుకుంది.శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన
కాంగ్రెస్ పార్టీ కేవలం 17 ఏళ క్రితం ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో
విలీనమయ్యే దిశగా పతనమవుతోందంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎదుర్కొంటున్న దయనీయ
పరిస్థితి చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది.శాసనసభ ఎన్నికల్లో గెలిచిన 19 మంది ఎమ్మెల్యేతో
పాటు పార్టీ కీలక,సీనియర్ నేతలు తెరాసలో చేరిపోతుంటే వారిని ఎలా కాపాడుకోవాలో తెలియక
దిక్కులు చూస్తోంది.ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరిపోగా చాలా మంది
సీనియర్ నేతలు తెరాసలో చేరారు.తాజాగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే సైతం తెరాసలో చేరతుండడం
కాంగ్రెస్ను మరింత కృంగదీస్తోంది. గతంలో ఆలేరు ఎమ్మెల్యేగా పని చేసిన బూడిద భిక్షమయ్యగౌడ్
కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక నేతగా వ్యవహరించారు.కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన
భిక్షమయ్య తన రాజీనామాకు కోమటిరెడ్డి సోదరులనేనని ఆరోపించారు.గత ఏడాది డిశెంబర్లో
జరిగిన ఎన్నికల్లో తనను ఓడించాలనే ఉద్దేశంతో స్వతంత్ర అభ్యర్థులను బరిలోకి దించి అనుకున్నది
సాధించుకున్నారని ఆరోపించారు.అదేవిధంగా భువనగిరి ఎంపీ టికెట్ను మధుయాష్కి లేదా గ్రూపులు
లేని ఇతర బీసీ నేతలకు ఇవ్వాలంటూ పార్టీ పెద్దలకు సూచించగా కోమటరెడ్డి సోదరులు అక్కడ
కూడా అడ్డుపడి టికెట్ తెచ్చుకున్నారంటూ ఆరోపించారు.కాంగ్రెస్లో బలహీన వర్గాలకు న్యాయం
జరగకపోవడం కూడా తమ రాజీనామాకు కారణమన్నారు.రాష్ట్రంలో తెరాస పాలన చాల బాగుందని లోక్సభ
ఎన్నికల్లో టికెట్ల పంపిణీ కూడా తమను చాలా ఆకట్టుకుందన్నారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధే
లక్ష్యంగా కేసీఆర్,కేటీఆర్లు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమను చాలా ఆకర్షించాయని
అందుకే మరో రెండు మూడు రోజుల్లో కార్యకర్తలతో కలసి తెరాసలో చేరనున్నామని భిక్షుమయ్యగౌడ్
తెలిపారు..