తిరుమల తిరుపతి దేవస్థానములకు చెందిన భూముల వేలం వేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు,తెలంగాణ పార్టీ నేతలే కాదు జగన్ నేతృత్వంలోని వైసీపీ పార్టీకి చెందిన ఎంపీ సైతం అసహనం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న తిరుమల వెంకన్న ఆస్తులను విక్రయించాలని టీటీడీ నిర్ణయం తీసుకోవడం పట్ల వైసీపీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు టీటీడీ నిర్ణయం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేయకుండా, మళ్లీ అవే తప్పులు చేయాలని టీటీడీ భావిస్తోందని విమర్శించారు.దేవుడి పేరిట ఉన్న ఆస్తులను అమ్మడం ద్వారా ఆ దేవుడికి టీటీడీ ద్రోహం చేస్తోందని అన్నారు. టీటీడీ తన నిర్ణయం ద్వారా…. భూములు విరాళంగా ఇచ్చిన దాతల మనోభావాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. దాతలు ఎంతో భక్తితో ఆస్తులు సమర్పిస్తారని, ఆ ఆస్తులను పరిరక్షించాలే కానీ, విక్రయించడం సబబు కాదని రఘురామ కృష్ణంరాజు హితవు పలికారు. ఈ అంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడించారు.మరోవైపు ఈ నిర్ణయంపై బీజేపీ,జనసేన పార్టీలు సైతం తీవ్రంగా మండిపడుతున్నాయి. తిరుమల శ్రీవారి ఆస్తులను అన్యాక్రాంతం చేసేందుకు టీటీడీ నిర్ణయాలు తీసుకుంటోందంటూ బీజేపీ ఏపీ నేతలు ఈ రోజు ఉపవాస దీక్షలకు దిగారు. టీటీడీ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నామంటూ జనసేనతో కలిసి బీజేపీ నేతలు తమ ఇళ్ల వద్దే ఈ దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా తన నివాసం నుంచి బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మీడియాతో మాట్లాడారు.హిందూ దేవాలయాల జోలికి రావద్దని తాము రాష్ట్ర ప్రభుత్వానికి చాలా సార్లు చెప్పామని కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. అయితే, తాము ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ప్రభుత్వం వినిపించుకోకుండా ఆలయాల భూములపై ముందుకు వెళ్తోందని విమర్శించారు. మంగళగిరి, అన్నవరంలో ఆలయ భూములు తీసుకునే ప్రయత్నాలు చేశారని వివరించారు. తాము చేస్తోన్న ఆందోళనల వల్లే ఇప్పటికే మంగళగిరి, అన్నవరం భూముల విషయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందని చెప్పారు.
ఇప్పుడు టీటీడీ భూములకే ఎసరు పెట్టారని విమర్శించారు. ధార్మిక సంస్థలన్నీ ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాయని ఆయన తెలిపారు. టీటీడీ చైర్మన్ మాత్రం భూముల అమ్మకానికి కేవలం రోడ్ మ్యాప్ ఇచ్చామంటూ వ్యాఖ్యలు చేశారన్నారు. తిరుమల శ్రీవారి ఆస్తులు అన్యాక్రాంతం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయాలు తీసుకుంటోందంటూ బీజేపీ ఏపీ నేతలతో పాటు జనసేన నేతలు కూడా ఈ రోజు ఉపవాస దీక్షలు చేస్తున్నారు. తన నివాసం వద్ద తాను కూడా ఈ దీక్షల్లో పాల్గొంటున్నానని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఉపవాస దీక్ష ప్రారంభించేముందు వెంకటేశ్వర స్వామి విగ్రహానికి పూజలు చేశారు. సీఎం జగన్ ప్రభుత్వం ఆలయ భూములను అమ్మాలనుకోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ… ‘టీటీడీ భూముల అమ్మకం ప్రయత్నాలను ఏపీ ప్రభుత్వం ప్రస్తుతానికి ఉపసంహరించుకున్నప్పటికీ ధర్మ పరిరక్షణ కోసం ఉపవాస దీక్షని కొనసాగిస్తున్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు‘ అని అన్నారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు బీజేపీతో కలిసి జనసేన ప్రారంభించిన ఈ దీక్షలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయని చెప్పారు.