అమరావతి : శాసన సభ కోటా నుంచి ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు బుధవారం నోటిఫికేషన్ వెలువడింది. మూడు స్థానాలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ నెల 14 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 16వ తేదీ నామినేషన్ల పరిశీలన, 19న ఉపసంహరణ ఉంటుంది. అవసరమైతే ఈ నెల 26న ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. తెదేపాకు చెందిన కరణం బలరామ కృష్ణమూర్తి, వైకాపాకు చెందిన ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), కోలగట్ల వీరభద్ర స్వామిలు ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో ఉప ఎన్నిక నిర్వహించాల్సి వస్తోంది. తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి తెరాస అభ్యర్థిగా గుత్తా సుఖేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.