ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లు విజయవంతంగా పూర్తి చేసిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ లిమిటెడ్(ఎంఈఐఎల్) తాజాగా కాళేశ్వరంలో భారీ విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం – ట్రాన్స్ మిషన్ల లైన్ల ఏర్పాట్లలో మరో రికార్డ్ ను సొంతం చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం 4627 మెగావాట్ల విద్యుత అవసరంకాగా అందులో ఎంఈఐఎల్ 3057 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసే ఆరు సబ్ స్టేషన్లు వాటి లైన్లను సకాలంలో పూర్తి చేసి తన సామర్థ్యాన్ని చాటుకుంది. ప్రపంచంలో ఇంత పెద్దస్థాయిలో విద్యుత్ వినియోగించే మొదటి ఎత్తిపోతల పథకంగా కాళేశ్వర ప్రాజెక్ట్ చరిత్ర పుటలోకెక్కింది.ఇక్కడ వినియోగించే విద్యుత్ వ్యవస్థ ఎంతపెద్దదంటే ఈశాన్య రాష్ట్రాలతో పాటు జమ్ముకశ్మీర్,బిహార్ రాష్ట్రాలు వినియోగించే విద్యుత్ను ఈ ఒక్క ప్రాజెక్ట్లో వినియోగిస్తున్నారు. కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన విద్యుత్ వ్యవస్థ సామర్ధ్యం ఈశాన్య రాష్ట్రాల సరఫరా 3916 మెగావాట్లకు చేరువలో ఉండటం గమనార్హం.2017లో నాలుగు సబ్స్టేషన్ల పనులను తెలంగాణ ప్రభుత్వం ఎంఈఐఎల్ కు అప్పగించగా రికార్డు సమయంలో అంటే 2019 మే నెలాఖరు నాటికి వరుసగా ఆరు సబ్ స్టేషన్లను ఎంఈఐఎల్ అందుబాటులోకి తెచ్చింది. రెండేళ్లలోనే 260 కిలో మీటర్ల ట్రాన్స్ మిషన్ లైన్లను ఏర్పాటు చేసి సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా పనులు పూర్తి చేసి ఘనతను ఎంఈఐఎల్ ఖాతాలో వేసుకుంది. 400 – 220కేవీ లాంటి అత్యధిక సామర్ధ్యం కలిగిన ఆరు సబ్ స్టేషన్లను అతి తక్కువ కాలంలో పూర్తి చేసి ఎంఈఐఎల్ సత్తాను నిరూపించింది.