కోల్కతా: భవానీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచిన మమతా బెనర్జీ అక్టోబరు 7 న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి సీఎం మమతా మంగళవారం గవర్నర్ జగదీప్ ధన్కర్కు లేఖ రాశారు. భవానీపూర్, జంగీపూర్, షంషేగంజ్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో టీఎంసీ క్లీన్ స్వీప్ చేసింది. ఎన్నికల కమిషన్ ప్రకారం మమతా.. 85,263 ఓట్లను సాధించింది. బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్ 26,428 ఓట్లు సాధించింది.పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగిన మమత, టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సువేందు అధికారి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో ఆమె ఉప ఎన్నికల్లో పోటీ చేసి, గెలవాల్సిన అనివార్యత ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించడంతో మమతా బెనర్జీ మూడోసారి సీఎం పదవి చేపట్టిన సంగతి తెలిసిందే.