కోల్కతా : పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల జాబితా (ఎన్ఆర్సీ)లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ గురువారం భాజపాకు గట్టి సవాల్ విసిరారు. కోల్కతాలో జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ దమ్ముంటే పౌరసత్వ సవరణ చట్టంపైనా, ఎన్ఆర్సీపైనా ఐక్య రాజ్య సమితి పర్యవేక్షణలో రిఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేశారు. రిఫరెండంలో భాజపా ఓడిపోతే, వెంటనే గద్దె దిగాలన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ‘మీకు ఆధిక్యత ఉన్నంత మాత్రానికి ఏదైనా చేసేయడం సాధ్యం కాదు. సమాజపు స్తంభాలను, అందరినీ మీరు భయకంపితుల్ని చేస్తున్నారు’ అని గర్జించారు. స్వాతంత్ర్యం వచ్చి 73 ఏళ్ళు గడిచిపోయాయి, ఇప్పుడు హఠాత్తుగా మనం భారతీయ పౌరులమని నిరూపించుకోవలసి వస్తోందన్నారు. ఆ సమయంలో భాజపా తోక, తల ఎక్కడున్నాయని నిలదీశారు. దేశాన్ని భాజపా విభజిస్తోందన్నారు. ‘మనం పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరింపజేయాలి, అందుకని మీరు నిరసనలు ఆపకండి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు.