న్యూ ఢిల్లీ : భూతాపం వల్ల హిమాలయాల్లో మంచు పర్వతాలు కరిగి ఏర్పడుతున్న సరస్సులు మరింత విస్తరిస్తున్నాయని ఇస్రో తాజాగా వెల్లడించింది. 2016-17లో గుర్తించిన 2,431 సరస్సుల్లో 89 శాతం పెద్ద ఎత్తున విస్తరించాయని ఇస్రో నివేదిక తెలిపింది. వీటి పరిమాణం గత 38 ఏండ్లలో రెట్టింపు అయ్యిందని పేర్కొన్నది. భూ వాతావరణం వేడెక్కటం వల్లే భౌగోళిక మార్పులు సంభవించి హిమనీనదాలు కరిగిపోతున్న సంగతి తెలిసిందే. దీనివల్ల కొత్తగా సరస్సులు ఏర్పడటం, ఉన్న సరస్సులు విస్తరించి లోతట్టు ప్రాంతాల్ని వరదలు ముంచెత్తే ప్రమాదం ఉంటుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. 1984 నుంచి 2023 వరకు భారతీయ హిమాలయ నదీ పరివాహక ప్రాంతాలను కవర్ చేసే దీర్ఘకాలిక ఉపగ్రహ చిత్రాలు విశ్లేషించిన ఇస్రో, నదులు, సరస్సుల పరిమాణంలో గణనీయ మార్పులు వచ్చినట్టు పేర్కొన్నది.