శ్రీశైలం : ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్లతో పాటు తెలంగాణలోని జూరాల, ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం జలాశయాలు నిండిపోవడంతో నాగార్జున సాగర్ జల కళను సంతరించుకుంది. శ్రీశైలంలో పది గేట్లు, నాగార్జున సాగర్లో 26 గేట్లను ఎత్తివేశారు. జూరాలకు 8.70 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుండగా, అన్ని గేట్లను ఎత్తివేసి దాదాపు అంతే పరిమాణంలో కిందకు వదులుతున్నారు. శ్రీశైలంలోకి 7.53 లక్షల క్యూసెక్కులు వస్తుండగా, 8.51 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలారు. నాగార్జున సాగర్కు 8.25 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, జలాశయంలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. అధికారులు 26 గేట్లను ఎత్తివేసి 65,207 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 559.20 అడుగులు ఉంది. సాగర్కు వరద ఉధృతి ఇలాగే కొనసాగితే ఒకటి, రెండు రోజుల్లో పులిచింతల కూడా నిండే అవకాశం ఉంది. అనంతరం కృష్ణమ్మ ప్రకాశం బ్యారేజీ మీదుగా బంగాళాఖాతంలో కలుస్తుంది. మరో వైపు నాగార్జున సాగర్కు పర్యాటకుల తాకిడి పెరిగింది. సోమవారం బక్రీద్ సెలవు కావడంతో పర్యాటకుల సంఖ్య మరింతగా పెరిగింది.
శ్రీశైలం జలాశయం నుంచి విడుదలవుతున్న నీరు