తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి.గత ఏడాది శాసనసభ ఎన్నికలు ముగిసిన అనంతరం మొదలైన వలసలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.ఎమ్మెల్యేల వలసలతో ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయి అధికార పక్షంలో విలీనం కావడంతో ఉనికి కోసం పోరాడుతున్న కాంగ్రెస్కు ఇతర సీనియర్ నేతలు,కీలక నేతలు కూడా తెరాస,బీజేపీ పార్టీల్లోకి వలస వెళుతుండడం కాంగ్రెస్ను మరింత కుదేలు చేస్తోంది.తాజాగా కొండా సురేఖ దంపతులు బీజేపీలో చేరడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.గత ఏడాది తెరాసకు రాజీనామా చేసి కొండా దంపతులు కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే.కాంగ్రెస్లో చేరే సమయంలో కొండా మురళి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా గత ఏడాది డిశంబర్లో జరిగిన ముందస్తు శాసనసభ ఎన్నికల్లో పరకాల నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కొండా సురేఖ ఓటమిపాలయ్యారు.అప్పటి నుంచి కాంగ్రెస్లో కూడా మౌనంగా ఉంటున్న కొండా దంపతులు త్వరలో బీజేపీలో చేరడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.అయితే బిజెపిలో చేరడానికి కొండా సురేఖ షరతు పెడుతున్నట్లు తెలుస్తోంది. తన కూతురు సుస్మితా పటేల్ కు భూపాలపల్లి శాసనసభ స్థానం కేటాయించాలని ఆమె కోరుతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లోనే సుస్మితా పటేల్ ను భూపాలపల్లి నుంచి బరిలోకి దింపాలని కొండా దంపతులు భావించారు.దీంతో తమ కుటుంబానికి ఎన్నికల్లో మూడు టికెట్లు కేటాయించాలంటూ కొండా సురేఖ కోరగా అందుకు కేసీఆర్ నిరాకరించడంతో తెరాసను వీడి కాంగ్రెస్లో చేరినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.అయితే, కాంగ్రెసులో చేరినప్పటికీ కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ కు శాసనసభ టికెట్ లభించలేదు. సుస్మితా పటేల్ భూపాలపల్లిలో చురుగ్గా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే, గత ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన గండ్ర సత్యనారాయణ కూడా బిజెపిలో చేరడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. తొలుత టీడీపిలో ఉన్న గండ్ర సత్యనారాయణ 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. భూపాలపల్లి టికెట్ ను అటు కొండా సురేఖతో పాటు గండ్ర సత్యనారాయణ కూడా ఆశిస్తుండడంతో బీజేపీలో దీనిపై సందిగ్ధత నెలకొంది..