మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు అసలే ఉనికి కోసం తీవ్రంగా పోరాడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న తెలంగాణ కాంగ్రెస్కు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరు ఊపిరాడనివ్వకుండా చేస్తోంది.తెలంగాణలో శాసనసభ,లోక్సభ ఎన్నికల్లో కాంగ్రస్ పార్టీ ఓటమికి కాంగ్రెస్ అధిష్టానమే కారణమని రాజగోపాల్రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్ర నాయకత్వంలో మార్పులు చేయకపోతే తెలంగాణలో కాంగ్రెస్కు భవిష్యత్తు ఉండదని తెలిపినా కాంగ్రెస్ అధిష్టానం పెడచెవిన పెడుతోందంటూ ఆరోపించారు.శాసనసభ ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదురైనా కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా,పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డిలను మార్చకపోవడంతోనే కాంగ్రెస్కు ఈ పరిస్థితులు దాపురించాయంటూ రాజగోపాల్రెడ్డి ఆరోపిస్తున్నారు.తెలంగాణలో కేసీఆర్ను ఎదుర్కోవడం కాంగ్రెస్కు సాధ్యం కాదని తెరాసకు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని కాంగ్రెస్లోనే కొనసాగితే తనకు కూడా భవిష్యత్తు ఉండదని భావించిన రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరడానికి సిద్ధమైనట్లు సమాచారం.బీజేపీలో చేరే విషయమై చర్చించడానికి ఢిల్లీకి వెళ్లి బీజేపీ జాతీయాధ్యక్షుడు,కేంద్ర హోంమంత్రి అమిత్షాతో చర్చించనున్నట్లు తెలుస్తోంది..