‘అన్వేషణ’ సినిమాలో భానుప్రియ, కార్తీక్ లాంటివాళ్లు.. అక్షిత, పీయూష్! ఆ సినిమాలో భానుప్రియ చెట్టూ పుట్టా తిరిగి శ్రావ్యమైన శబ్దాలను అన్వేషిస్తూ ఉంటే, కార్తీక్ ఆమెకు హెల్ప్ చేస్తుంటాడు. ఇక్కడా అంతే. అక్షితకు ఆమె భర్త పీయూష్ పరిశోధన సహకారం అందిస్తున్నారు. ఈ దంపతులకు వినాయక్ అనే మరో ప్రకృతి ప్రేమికుడు కూడా తోడయ్యాక.. అంతరించిపోతున్న గిరిజన గీతాలన్నీ ఒకటొకటిగా మళ్లీ ప్రాణం పోసుకుంటున్నాయి. భారతదేశంలో కొన్ని వేల గిరిజన జాతులు ఉన్నాయి. వారి సంప్రదాయాలు, వేషధారణ, సంగీతం అన్నీ వేటికవే ప్రత్యేకం. అటువంటి జాతులలో కొన్ని జాతులు రానురాను అంతరించిపోతున్నాయి. వాటికి సంబంధించిన సమాచారాన్ని ఎవరో ఒకరు జాగ్రత్త చేయకపోతే, కొంతకాలానికి ఈ జాతుల గురించి ప్రపంచానికి తెలిసే అవకాశం ఉండదనే ఉద్దేశంతో పీయూష్ గోస్వామి, అక్షిత దంపతులు ‘ది పార్గాటెన్ సాంగ్స్’ అనే ఒక ప్రణాళిక రూపొందించారు!
బియాట్ పాట ‘బీట్’ ఆగింది!
పీయూష్, అక్షిత దంపతులు నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటారు. అలా ఒకసారి అస్సాంలోని డిమో హసావ్ జిల్లాను సందర్శించారు. అక్కడ ‘ఎపా లల్లురా’ అనే బియాట్ గిరిజన తెగ నాయకుడిని కలిశారు.ఆయనతో మాట్లాడుతూండగా ఆ తెగ వారి సంగీతం కాలగర్భంలో కలిసిపోతోందన్న బాధ ఆ నాయకుడి ముఖంలో కనిపించింది. వారు బియాట్ భాషతో పాటుగా యాసతో కూడిన హిందీ, బెంగాలీ, అస్సామీ, థింసా భాషలు, నాగాలాండ్లోని మాండలికాలు మాట్లాడగలరని లల్లూరా మాటల నుంచి తెలుసుకున్నారు. వారి భాష కేవలం మౌఖికంగా మాత్రమే మిగిలే స్థితికి వచ్చింది. వారిలోని కొత్తతరానికి.. బియాట్ భాష రాకపోవడం వల్ల సంప్రదాయ సంగీతానికి కాలం చెల్లుతోందని ఈ దంపతులకు లల్లూరా చెప్పారు. బియాట్ జాతి వారు ఈశాన్య భారతంలో ఉంటారు. వీరు చైనా నుంచి ఇక్కడకు వలస వచ్చినట్లుగా భావిస్తారు. అక్కడ వారు మైనారిటీలే అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఇంకా గుర్తించలేదు. ఈ విషయం గోస్వామి దంపతులను కదిలించింది. వీరు అప్పటికే ‘రెస్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ’ (ఈ ఊరు, ఈ నేల) అనే ఒక లాభాపేక్ష లేని సంస్థను స్థాపించారు. గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న సాంఘిక, ఆర్థిక సమస్యలను తెలుసుకుని, పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. లల్లూరా మాటలు విన్నాక ‘‘ఏదో ఒకటి చేద్దాం’’ అన్నారు గోస్వామి.