సిడ్నీ: టీమిండియా దశాబ్దాల కల నెరవేరింది. ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి సిరీస్ గెలిచి సగర్వంగా నిలిచింది. 4 టెస్టుల సిరీస్ను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకోవడంతో 72 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఆసీస్ గడ్డపై ఇన్నేళ్ల తర్వాత తొలి టెస్టు సిరీస్ను టీమిండియా కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కోహ్లీ సేన ముద్దాడి విదేశీగడ్డపై సత్తా చాటింది. గతంలో 1980-81, 1985-86, 2003-04 పర్యటనల్లో భారత్ సిరీస్ను డ్రా చేసుకుంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన 47 టెస్టుల్లో భారత్కు 7 విజయాలు దక్కాయి.