నిలదీస్తాననే భయంతో తనను పార్టీ నుంచి బయటకు పంపడానికి నిర్ణయించుకొని పొమ్మనలేక పొగబెడుతున్నారంటూ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు ఆరోపించారు.శాసనసభ నుంచి స్థానిక సంస్థల ఎన్నికల వరకు అన్నింట్లోనూ కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంపై ఎందుకు సమీక్షలు నిర్వహించలేదంటూ పార్టీ అంతర్గత సమావేశాలతో పాటు బయటకూడా ప్రశ్నించానన్నారు.ఇలా ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేని కొంతమంది కాంగ్రెస్ నేతలు తమను బయటకు పంపించడానికి నిర్ణయించుకొని పొమ్మనలేక పొగపెడుతున్నారని ఆరోపించారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించిన వీహెచ్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినందునే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోలేదని ఆయన అభిప్రాయపడ్డారు.కాంగ్రెస్ పార్టీ తనకు అన్నీ ఇచ్చిందని.. అందుకే పార్టీని కాపాడుకొనేందుకు తాను చివరివరకు కష్టపడుతున్నట్టుగా చెప్పారు. పీసీసీ చీఫ్ పదవిని తనకు ఇస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొస్తానని వీహెచ్ చెప్పారు. రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ ఇవ్వకుండా కొప్పుల రాజు మరికొందరు నేతలు తప్పుదోవపట్టిస్తున్నారని మండిపడ్డారు. ఒకవేళ తనను బయటకు వెళ్తే రాజీవ్ కాంగ్రెస్ పేరుతో పార్టీని పెడతానని ఆయన ప్రకటించారు.చివరగా తెరాసలో చేరాలని తనకు పలు మార్లు ఆఫర్లు వచ్చాయని కానీ తనది కాంగ్రెస్ రక్తమని అందుకే వెళ్లలేదని స్పష్టం చేశారు..