న్యూఢిల్లీ :మధ్యప్రదేశ్ శాసన సభలో బల పరీక్ష చేపట్టకుండానే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కమలనాథ్ ను ఆదేశించింది. శుక్రవారం కమల్ నాథ్ ప్రభుత్వం తన బలాన్ని దిగువ సభలో నిరూపించుకోవాల్సి ఉంది. 22 మంది శాసన సభ్యుల రాజీనామా వల్ల కమలనాథ్ ప్రభుత్వం అధిక్యతను కోల్పోయింది. అనూహ్య రీతిలో ఆ సభ్యుల రాజీనామాల్ని సభాపతి ఆమోదించారు. స్వల్ప మెజారిటీతో కమల్ నాథ్ ప్రభుత్వం రాజ్యాధికారాన్ని నెట్టుకుని వచ్చింది. జ్యోతిరాదిత్య సింధియా తన వర్గం ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించటంతో కమల్ నాథ్ సర్కారు ఆధిక్యతను కోల్పోయింది. శుక్రవారం సాయంత్రం లోగా బల నిరూపణ జరగాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి బాధ్యతలు చేపడతారని భాజపా నేతలు అంటున్నారు.