ఢిల్లీలో విద్యార్థుల ర్యాలీ భగ్నం

ఢిల్లీలో విద్యార్థుల ర్యాలీ భగ్నం

ఢిల్లీ : జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఈనెల 5న జరిగిన సంఘటనను నిరసిస్తూ ఢిల్లీలో విద్యార్థులు గురువారం సాయంత్రం చేపట్టిన నిరసన ఉద్రిక్తతంగా మారింది. రాష్ట్రపతి భవన్‌ వరకు ర్యాలీగా వెళ్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. జేఎన్‌యూ ఉప కులపతిని వెంటనే తొలగించాల్సిందిగా విద్యార్థులు డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ) మంత్రిత్వ శాఖతో విద్యార్థి సంఘాలు భేటీ అయ్యాయి. జేఎన్‌యూ వీసీని తొలగించేందుకు విద్యార్థి సంఘాలు కోరగా అందుకు హెచ్‌ఆర్‌డీ నిరాకరించింది. దీంతో ఆయన్ను తొలగించాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతిని కలిసేందుకు విద్యార్థులు ర్యాలీగా వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులను నిలువరించే ప్రయత్నంలో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. దీంతో పలువురు విద్యార్థులను పోలీసులు బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. ఈ సంఘటనలో ఒక విద్యార్థి గాయపడ్డాడు. దీంతో ఆందోళనకారులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత ఆదివారం జేఎన్‌యూలోకి ముసుగులతో ప్రవేశించిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు విద్యార్థులు, అధ్యాపకులపై కర్రలు, రాడ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో 30 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు. జేఎన్‌యూ సంఘటనను పలువురు ప్రముఖులతో పాటు విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos