ఢిల్లీ : ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది. రాష్ట్రంలో 81 నియోజకవర్గాలున్నాయి. నవంబరు 30 నుంచి డిసెంబరు 20 వరకు మొత్తం అయిదు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబరు 23న ఫలితాలు వెల్లడిస్తామని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునిల్ అరోడా తెలిపారు. తొలి దశలో 13 అసెంబ్లీ స్థానాలకు నవంబరు 30న, రెండో దశలో 20 నియోజకవర్గాలకు డిసెంబరు 7న, మూడో దశలో 17 అసెంబ్లీ స్థానాలకు డిసెంబరు 12న, నాలుగో దశలో 15 నియోజకవర్గాలకు డిసెంబరు 16న, ఐదో దశలో 16 అసెంబ్లీ స్థానాలకు డిసెంబరు 20న ఎన్నికలు జరగనున్నాయి. మావోయిస్టుల ప్రభావం ఉన్న 67 శాసనసభ నియోజకవర్గాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. పోలింగ్ కేంద్రాలను కూడా 20 శాతం పెంచుతామని అరోడా వెల్లడించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్తో కలిసి భాజపా 43 సీట్లలో గెలిచి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. భాజపా ఒక్కటే 37 స్థానాల్లో విజయం సాధించింది. అంతకుముందు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) గత ఎన్నికల్లో కేవలం 18 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్కు ఎనిమిది సీట్లు మాత్రమే వచ్చాయి.