ఇటీవల జరిగిన శాసనసభ,లోక్సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వంపై అప్పుడే విమర్శల పర్వం మొదలైంది.ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు అధికార వైసీపీపై విమర్శలు చేయడం సహజమే అయినా తెదేపాతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా విమర్శలు చేస్తుండడం గమనార్హం.తాజాగా లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ్ కూడా వైఎస్ జగన్ పాలనపై విమర్శలు చేశారు.నెలరోజుల పాలనపై ఇప్పుడే ఏమి చెప్పలేమని వ్యాఖ్యానిస్తూనే వైఎస్ జగన్ పాలన జమీందారి పాలనను గుర్తుకు తెస్తోందంటూ విమర్శించారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలు,హామీలు ఇచ్చాను కాబట్టి వాటిని నెరవేర్చడం కోసం ఏమైనా చేస్తానంటూ ముందుకు దూకడం పాలన కాదని తెలిపారు.గత ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికను కూల్చేయడం ఘోరమైన తప్పిదమని వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్లో పాలనను నిర్మాణాలతో కాకుండా విధ్వంసాలతో మొదలుపెట్టారన్నారు.ఒక కుటుంబం అభివృద్ధి చెందాలి అంటే ఏ తరహా ప్రణాళికలతో ముందుకు వెళ్తుందో ఆ తరహా ప్రణాళికలు ప్రభుత్వానికి సైతం వుండాలన్నారు. పూర్వకాలం జమిందారుల వ్యవస్థలా , రాచరికంలా, నిజాముల పాలనలా అప్పటికప్పుడు తోచింది చేస్తే ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని వైఎస్ జగన్ పాలన కూడా అలాగే ఉందంటూ జయప్రకాశ్ నారాయణ్ విమర్శించారు . మాటిచ్చాను కాబట్టి తప్పక చేస్తాను అని చెప్పి ఆచరణ సాధ్యం కానివి ప్రజలకు ఇస్తానని చెప్పటం అభివృద్ధిని నాశనం చేస్తుంది. మాట ఎన్నికల్లో ఇచ్చి ఉండొచ్చు కానీ అధికారంలోకి వచ్చాక అయినా రాజ్యాంగాన్ని,రాష్ట్రాన్ని రక్షించేలా నిర్ణయం తీసుకోవాలి కానీ ఇది రాచరికమో, ఫ్యూడల్ రాజ్యమో కాదని జగన్ పాలనపై వ్యాఖ్యలు చేశారు.మొన్నటికి మొన్న ప్రజా వేదిక కూల్చివేత గురించి మాట్లాడుతూ తెల్ల వాళ్ళు కట్టారని పార్లమెంట్ భవనాన్ని నాటి ప్రభుత్వాలు కూల్చేయలేదని జేపీ అన్నారు.ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తీవ్రమైన కారణాలు అయితేనే ఈ తరహా నిర్ణయం తీసుకోవాలని, పుర్రెకు బుద్ధి పుట్టిందని ఏది పడితే అది చేస్తే సమంజసం కాదని జేపీ పేర్కొన్నారు. రాజకీయ నాయకులు ఎన్నికలలో విజయం సాధించడానికి ఓటర్లను వివిధ మార్గాల ద్వారా ప్రలోభ పెట్టారని జేపీ పేర్కొన్నారు..