అమరావతి:‘ మొత్తం 23 మంది తెదేపా శాసన సభ్యులు 18 మంది మాతో సంప్రదింపులు జరుపుతున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు త్వరలోనే జైలుకు వెళతార’ని భాజపా జాతీయ కార్యదర్శి, ఆంధ్ర ప్రదేశ్ భాజపా వ్యవహారాల సహ బాధ్యుడు సునీల్ దేవ్ ధర్ గురువారం ఒక వార్తా సంస్థకు తెలిపారు. చంద్ర బాబు నాయుడుతో బాటు అప్పటి పలువురు మంత్రులు, అనుచరులు తీవ్రమైన అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ఇందువల్లే తెదేపా శాసనసభ్యులు తమను సంప్రదిస్తున్నారన్నారు. ఒక్కో లోక్ సభ నియోజకవర్గంలో ఒక లక్ష మందిని భాజపా సభ్యులుగా చేర్చుకోవాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ముఖ్యంగా పేద ప్రజలకు చేరువయ్యేందుకు కృషి చేస్తున్నామన్నారు. తెదేపాకు భవిష్యత్ శూన్యమని వ్యాఖ్యానించారు. ‘చంద్రబాబు మెడపై అరెస్టు కత్తి వేలాడుతోంది. ఏ క్షణమైనా ఆయన కటకటాల వెనక్కు వెళతార’న్నారు.