మొదటిసారి అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన పాలన ప్రత్యేకత చాటుకోవడానికి అడుగడుగునా తపిస్తున్నట్లు వైఎస్ జగన్ చర్యల ద్వారా స్పష్టమవుతోంది.తమ ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలుస్తోందని మాటలకే పరిమితం కాదు…ఆచరణలో కూడ తాము ముందుంటామని సంకేతాలివ్వడానికి వైఎస్ జగన్ సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు.ఈ క్రమంలో ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలకు రూ. 7లక్షల పరిహారాన్ని చెల్లించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకొన్నారు.ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.బుధవారం నాడు స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ సీఎం జగన్ మాట్లాడారు.ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. గత ఐదేళ్లలో సుమారు 1513 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొంటే.. కేవలం 391 మంది రైతులకు మాత్రమే పరిహరం చెల్లించినట్టుగా జిల్లాల నుండి సమాచారం అందింది.అయితే ఆత్మహత్యలు చేసుకొన్న కుటుంబాలకు పరిహరం చెల్లించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో కుటుంబానికి రూ. 7 లక్షలను పరిహారంగా ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. ఆయా జిల్లాల్లో ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాల ఇంటికి వెళ్లి జిల్లా కలెక్టర్లు నేరుగా పరిహారం చెల్లించాలని జగన్ సూచించారు.