అమరావతి: శాసన సభా సంప్రదాయాలు, నిబంధనల గ్రంథాల్ని సభ్యులందరూ చదవాలని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సూచించారు. బుధవారం ఇక్కడ ఆరంభమైన శాసనసభ్యుల శిక్షణా తరగతుల శిబిరంలో ప్రారంభోపన్యాసాన్ని చేసారు. ‘సభలో మన సంఖ్య ఎక్కువ కదా. మనం చేయి ఎత్తితే సభాపతి మాట్లాడేందుకు అవకాశం ఇస్తారని చాలామంది భావిస్తారు. కానీ అలా జరగకపోవచ్చు. ఎందుకంటే ఫలానా అంశంపై వీరు-వీరు మాట్లాడుతారని స్పీకర్కు పట్టిక ఇచ్చి ఉంటాం. దాని ప్రకారమే స్పీకర్ సభ్యులకు అవకాశాన్ని ఇస్తారు. ఆ జాబితాలో మన పేరు లేని వారికి అవకాశం రాకపోవచ్చు. దీనికి మరోలా అనుకోవాల్సిన పని లేద’ని చెప్పారు. తాము మాట్లాడదలచిన విషయాల గురించి ఆయా పార్టీల శాసన సభ వ్యవహారాల బాధ్యులకు ముందుగా సమాచారాన్ని ఇవ్వాలని సూచించారు. ‘చట్టసభలో మాట్లాడదలచిన అంశం గురించి బాగా సిద్ధమై రావాలి. సంసిద్ధత ప్రాతిపదికనే ప్రసంగాలు ఆసక్తిగా ఉన్నాయా లేక నిస్సారంగా ఉన్నాయో తేలుతాయి. ఎంత గొప్ప వక్తయినా సరే తయారు కాకుండా వస్తే దారుణంగా విఫలమవుతారు. అప్పటికప్పుడు మాట్లాడితే ఎదుటివారు ఓ పత్రాన్ని చూపి దీన్ని చూడు.. తెలియకపోతే తెలుసుకో అని అంటే ఇబ్బందికి గురవుతాతాం. దీన్ని ఎవ్వరూ మర్చిపోవద్దు’ అని హితవు పలికారు. తెదేపా సభ్యులు తప్పా మిగలిన పార్టీల వారంతం తరగతులకు హాజరయ్యారు.