ముంబయి: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)జట్టులో వాటాలు కొనబోతున్నట్లు కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. వీటిపై తాజాగా బిగ్బి మీడియా ద్వారా స్పష్టత ఇచ్చారు. ఐపీఎల్జట్టులో వాటా కొనడంపై తనకే కాదు, తన కుటుంబీకులకు కూడా ఆసక్తి లేదని వెల్లడించారు. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్లో సగం వాటాలు విక్రయించేందుకు జట్టు యజమానులు యోచిస్తున్నట్లు గతంలో వార్తలు వెలువడ్డాయి. వీటిని కొనుగోలు చేసేందుకు బచ్చన్ కుటుంబీకులు ఆసక్తి చూపుతున్నారని, దీని గురించి జట్ల యజమానులతోనూ సంప్రదింపులు జరిపారని పలు మీడియా వర్గాలు వెల్లడించాయి. రాజస్థాన్ రాయల్స్లో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు ఒకప్పుడు వాటాలుండేవి. కానీ 2015లో సీఎస్కే, ఆర్ఆర్ మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలు రావడంతో అవి చేతులు మారాయి. మరోపక్క అమితాబ్ ఫ్యామిలీకి ప్రో కబడ్డీ లీగ్లో జయపుర పింక్ పాంథర్స్ జట్టులో, ఇండియన్ సూపర్ లీగ్లోని చెన్నయన్ ఫుట్బాల్ క్లబ్లో వాటాలున్నాయి.