కర్ణాటక రాష్ట్రంలోని మండ్య లోక్సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బహుభాష నటి సుమలత అంబరీశ్ కర్ణాటక సీఎం కుమారస్వామికి కంటిమీద కునుకు లేకుండా చేసిన విషయం తెలిసిందే.ఎన్నికల్లో మండ్య నుంచి తన కుమారుడు నిఖిల్కు పోటీగా సుమలత ఎన్నికల బరిలో నిల్చోవడం సుమలతకు కన్నడ అగ్రహీరోలైన యశ్,దర్శన్లతో పాటు పలువురు సినీ ప్రముఖులు, కాంగ్రెస్ నేతలు కూడా మద్దతు పలకడంతో కుమారస్వామికి చుక్కలు కనిపించాయి.దీంతో ఎన్నికల పోటీ చేస్తున్నట్లు ప్రకటించన రోజు నుంచి ఎన్నికల ప్రచారాలు ముగిసే రోజు వరకు సుమలత ప్రతీ కదలికపై కుమారస్వామి నిఘా ఉంచినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో బెంగళూరు నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో సుమలత మండ్య జిల్లా కాంగ్రెస్ నేతలతో సమావేశమైన వీడియో ఒకటి కన్నడ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.వీడియో ఎలా తీశారు,ఎవరు తీశారు అనే విషయంపై సుమలత సన్నిహితులు ఆరా తీస్తున్నారు.కాగా సుమలత కదలికలను గమనించాలంటూ సీఎం కుమారస్వామి ఆదేశాల మేరకు సుమలత ప్రతీ కదలికపై సునిశిత నిఘా ఉంచిన నిఘా వర్గాలు సుమలత సమావేశాన్ని ముందే పసిగట్టి హోటల్ సిబ్బందితో సమావేశానికి సంబంధించి వీడియో తీయించి కుమారస్వామికి అందించి ఉంటారనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ వీడియోతో సీఎం కుమారస్వామి ఓటమి భయంతో తన ప్రతీ కదలికపై నిఘా ఉంచారంటూ ఎన్నికల ప్రచారాల సమయంలో సుమలత చేసిన ఆరోపణలకు మరింత బలం చేకూరింది..