నాటింగ్హామ్ : ప్రపంచ కప్పు టోర్నీ మెల్లమెల్లగా జోరందుకుంటున్న సందర్భంలో ఆ ఉత్సాహంపై వరుణుడు నీళ్లు చల్లుతున్నాడు. ఇప్పటికే రెండు మ్యాచులు వర్షార్పణం కాగా, మంగళవారం బ్రిస్టల్లో బంగ్లాదేశ్, శ్రీలంకల మధ్య జరగాల్సిన మ్యాచ్కు కూడా వరుణుడు అడ్డు పడ్డాడు. గురువారం భారత్, న్యూజిలాండ్ల మధ్య జరగాల్సిన మ్యాచ్కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ట్రెంట్బ్రిడ్జ్ లో ఈ మ్యాచ్ జరగాల్సి ఉండగా, రెండు రోజుల పాటు ఇక్కడ ఎడతెరిపి లేని వర్షం పడుతుందని వాతావరణ శాఖ స్థానికులను హెచ్చరించింది. గురువారం మధ్యాహ్నం ఏదైనా తెరపినిస్తే టీ20 మ్యాచుకు అవకాశం ఉండవచ్చు.