హొసూరు : పట్టణంలో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలను రెండు రోజుల పాటు అతి వైభవంగా నిర్వహించారు. హొసూరు సమీపంలోని బాగలూరు వద్ద గల ఏషియన్ క్రిస్టియన్ స్కూల్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. హొసూరు మాజీ ఎమ్మెల్యే కేఏ. మనోహరన్ అధ్యక్షత వహించి జ్యోతి ప్రజ్వలన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆరాధనోత్సవాలలో భాగంగా త్యాగరాజ స్వామి కీర్తనల బృంద గానం ప్రేక్షకులను అలరించాయి. అనంతరం నాదస్వర కచేరీ, పియానో కచేరీలు శ్రోతలకు వీనుల విందు చేశాయి. ఈ కార్యక్రమంలో తమిళనాడులోని వివిధ జిల్లాలకు చెందిన కళాకారులతో పాటు కర్ణాటక నుంచి వచ్చిన కళాకారులు పాల్గొన్నారు. శనివారం నాదస్వరంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
తదనంతరం హిందుస్థాన్ పాపులర్ సెంటర్కు చెందిన డీడబ్ల్యుఐ బ్యాండు బృందం, ప్రయత్న బ్యాండు బృందం ఆధ్వర్యంలో పంచరత్న కృతుల ఆలాపన కార్యక్రమం సాగింది. తర్వాత అనిల్ శ్రీనివాస్ సంగీత విభావరిని నిర్వహించారు. ఆదివారం స్థానిక కళాకారులతో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. చివరిగా టీఎం. కృష్ణ బృందం సంగీత, సాంస్కృతిక కార్యక్రమం అనంతరం ముగింపు ఉత్సవాన్ని నిర్వహించారు. తిరువాయూరు త్యాగరాజ ఆరాధనోత్సవాలను గుర్తుకు తెచ్చే విధంగా సాగిన ఈ కార్యక్రమాలు స్థానిక సంగీత
ప్రియులను ఆనంద డోలికల్లో ఓలలాడించాయి.