కోనసీమ అల్లర్లపై ఏపీ హోం శాఖ మంత్రి తానేటి వనిత బుధవారం డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో సమీక్షించారు. ఈ సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన వనిత…అల్లర్లలో సంఘ విద్రోహ శక్తులతో పాటు రౌడీ షీటర్లు కూడా ఉన్నారని తెలిపారు. అల్లర్లలో గతంలో 7కు పైగా కేసులు నమోదైన వారు 72 మంది ఉన్నారని ఆమె ప్రకటించారు. వీరిలో ఇప్పటిదాకా 46 మందిని అరెస్ట్ చేసినట్లుగా ఆమె తెలిపారు.
కోనసీమ జిల్లా.. ప్రత్యేకించి అమలాపురంలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని వనిత ప్రకటించారు. జిల్లాలో మరోమారు ఆందోళనలు జరగకుండా అదనపు బలగాలను మోహరించామని ఆమె తెలిపారు. మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే సతీశ్ ఇళ్లపై దాడికి దిగిన వారు కూడా అరెస్టయిన వారిలో ఉన్నారని హోం మంత్రి ప్రకటించారు.