బంగ్లాదేశ్తో జరిగిన టీ20 సిరీస్ను 2-1 తేడాతో సొంతం చేసుకున్న నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్ శర్మ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆట చేజారిపోతోందేమోనని సందేహిస్తున్న సమయంలో, బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారని కితాబిచ్చాడు. తమ జెర్సీలను చూపిస్తూ, దీని కోసమే మనం అడుతున్నామంటూ వారిలో స్ఫూర్తిని నింపానని చెప్పాడు. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని ఆడాలనే తాము కోరుకుంటున్నామని చెప్పాడు. ప్రపంచకప్ కు మనం దగ్గరవుతున్న కొద్దీ… జట్టులో సరైన సమతుల్యాన్ని మనం సాధించాలని తెలిపాడు.ఆస్ట్రేలియా పర్యటకు వెళ్లడానికి ముందే తమ మదిలో కొన్ని గేమ్ ప్లాన్స్ ఉన్నాయని చెప్పాడు. ఆటగాళ్లంతా ఇదే మాదిరి అద్భుత ప్రతిభను కనబరుస్తూ పోతే.. రానున్న రోజుల్లో జట్టు ఎంపిక విషయంలో కెప్టెన్ కోహ్లీతో పాటు సెలెక్టర్లకు పెద్ద తలనొప్పేనని చమత్కరించాడు.