న్యూ ఢిల్లీ: ‘నేను స్వేచ్ఛా జీవిని. ఎక్కడికైనా వెళ్తాను’అని రాజ్యసభ సభ్యుడిగా త్వరలో పదవీ విరమణ చేయనున్న కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ గురువారం ఇక్కడ వ్యాఖ్యానించారు. తన తుదిశ్వాస వరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని పేర్కొన్నారు. పదవీ విరమణ తర్వాత ఎంపీగా, మంత్రిగా, పార్టీలో ఏ పదవిలోనూ ఉండాలనుకోవడం లేదన్నారు. “1975లో జమ్ముకశ్మీర్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాను. పార్టీలో చాలా పదవులు చేపట్టాను. పలువురి ప్రధానులతో పని చేశాను. దేశానికి సేవ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా విధులను నిజాయితీగా నిర్వర్తించినందుకు సంతోషంగా ఉంది. ప్రపంచాన్ని దేశాన్ని అర్థం చేసుకునే అవకాశం లభించింది. రాజకీయవేత్తగా చేసిన సేవతో పూర్తిగా సంతృప్తిగా చెందాను. ఇప్పుడు నేను స్వేచ్ఛా జీవిని. ఎక్కడికైనా వెళ్తాను. చివరి శ్వాస వరకు ప్రజల సేవకే అంకితమవుతాను.”