ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్కు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ షాక్ ఇచ్చింది.సొసైటీకి చెందిన ఖాళీ స్థలాన్ని ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టారంటూ హౌసింగ్ సొసైటీ ఫిర్యాదు చేయడంతో జూబ్లిహిల్స్ ప్రషాసన్ నగర్లోని 149వ ప్లాటు నంబర్లో ఉన్న డీజీపీ ఠాకూర్ ఇంటి చుట్టూ ఉన్న ప్రహారీగోడను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేశారు. హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కొద్ది నెలల క్రితం నగరవ్యాప్తంగా అక్రమ నిర్మాణాలు గుర్తించే పనిలో పడ్డ అధికారులు నిర్మాణాలు కూల్చేస్తున్నారు.ఈ క్రమంలో సొసైటీ ఫిర్యాదు మేరకు డీజీనీ ఠాకూర్ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించిన అధికారులు జీహెచ్ఎంసీ పార్కులో కొంత స్థలం ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. దీంతో గతంలోనే అక్రమ కట్టడాల కూల్చివేతకు సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేయగా ఠాకూర్ సిటి సివిల్ కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు.అయితే గతంలో మంజూరు చేసిన ఇంజెక్షన్ ఆర్డర్ను కోర్టు ఇటీవల రద్దు చేయడంతో కొద్ది రోజుల క్రితం జీహెచ్ఎంసీ అధికారులు ఠాకూర్కు తుది నోటీసులు జారీ చేశారు.ఈ క్రమంలో మంగళవారం ఇంటి చుట్టూ నిర్మించిన ప్రహారీగోడ ఇతర నిర్మాణాలను అధికారులు పాక్షికంగా కూల్చశారు.జీహెచ్ఎంసీ పార్కు స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడంతో విచారణ చేపట్టిన కోర్టు అందుకు సంబంధించి ఈనెల 11వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ డీజీపీ ఠాకూర్ను ఆదేశించింది..జీహెచ్ఎంసీ తీసుకున్న చర్యల వల్ల కొద్ది కాలంగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాల నేతల మధ్య జరుగుతున్న పరిణామాలు,కొద్ది రోజుల క్రితం డేటా చోరీకి సంబంధించి ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలను మరింత తీవ్రతరంగా చేసే విధంగా ఉందంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.