అమరావతి : ప్రజా వేదికను కూల్చి వేస్తామనడం సరి కాదని తెదేపా సీనియర్ నేత, రాజమండ్రి గ్రామీణ శాసన సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య అన్నారు. ‘ప్రజల అవసరాల కోసం నిర్మించిన భవనం. ప్రస్తుతం అది కోర్టు పరధిలో ఉంది. గత 50 ఏళ్లలో ఆ ప్రాంతం ముంపునకు గురైన దాఖలాలు లేవు. కూల్చేస్తామన్న వ్యక్తి అక్కడే ఎందుకు కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఇది వైకాపా. ద్వంద్వ వైఖరి ఇక్కడే బయటపడింది. తెదేపా మీద కక్ష సాధించేందుకే ఇవన్ని చేస్తున్నారు. కరకట్టపై అనేక కట్టడాలున్నాయి. వాటన్నింటిని కూడా తొలగిస్తారా’ని ప్రశ్నించారు. వైకాపా కార్యకర్తలకు ఉపాధి కల్పించేందుకే గ్రామ వాలంటీర్ల నియామకాలు చేపట్టారని ఆరోపించారు. అవినీతి కేసుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ అవినీతి వ్యతిరేక మనటం హాస్యాస్పదమని విమర్శించారు. జగన్ 12 కేసుల్లో నిందితుడు రూ. 40 వేల కోట్లు ఈడీ సీజ్ చేసింది. మంత్రులు బొత్స సత్య నారాయణ, అవంతి శ్రీనివాస్లపై అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నారు. రాజ్యసభ సభ్యులు భాజపాలో చేరడం దారుణమన్నారు. ఇకపై ఐరావతాలకు తెదేపాలో చోటు ఉండబోదని పేర్కొన్నారు.