హైదరాబాద్ : చర్లపల్లిలో శాటిలైట్ రైల్వే స్టేషన్ నిర్మాణానికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం శంకుస్థాపన చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 427 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలను కూడా ప్రారంభించారు. యర్రగుంట్ల – నంద్యాల సెక్షన్ విద్యుదీకరణకు శంకుస్థాపన చేశారు. గుంతకల్లు – కల్లూరు సెక్షన్ రెండో మార్గాన్ని జాతికి అంకితం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మంత్రి రిమోట్ లింక్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, భాజపా ఎంపీలు బండి సంజయ్, అర్వింద్ పాల్గొన్నారు. శాటిలైట్ రైల్వే స్టేషన్కు శంకుస్థాపన చేయడం శుభ పరిణామమని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శాటిలైట్ రైల్వేస్టేషన్ నిర్మాణానికి, ఎంఎంటీఎస్ రెండో దశకూ కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉంటుందన్నారు. కేటాయింపుల్లో రైల్వే శాఖ దక్షిణ భారత దేశాన్ని విస్మరించిందని విమర్శించారు. రైల్వేమంత్రి ఏ రాష్ట్రానికి చెందిన వారైతే ఆ రాష్ట్రాన్నే అభివృద్ధి చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధిపై కూడా దృష్టిసారించాలని ఆయన కోరారు.