కొద్ది రోజుల క్రితం కమలం గూటికి చేరుకున్న మాజీ ఎంపీ వివేక్ తెరాస అధినేత కేసీఆర్పై అప్పుడే విమర్శనాస్త్రాలు సంధించడం షురూ చేశారు.నమ్మకద్రోహంలో కేసీఆర్ను మించినోళ్లు ప్రపంచంలో మరొకరు లేరని తనయుడు కేటీఆర్ కోసం తెరాస పార్టీకి మొదటి నుంచి అండగా నిలిచి రెండుసార్లు అధికారంలోకి రావడానికి అహర్నిశలు కష్టపడ్డ హరీశ్రావుకు అన్యాయం చేశారని ఆరోపించారు.తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన ఘటనలో కేసీఆర్ హస్తం కూడా ఉందని ఆరోపించారు. ఉద్యమం పేరుతో కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుందని తెరాస పూర్తిగా కుటుంబ పాలన పార్టీ అని ఆరోపించారు.తెరాస పార్టీ ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని కేసీఆర్కు బుద్ధి చెప్పాలంటే తెరాసను వీడి బిజెపిలో చేరాలని వివేక్ పిలుపునిచ్చారు. బిజెపి లోకి భారీగా చేరికలు జరుగుతున్న నేపథ్యంలో ఇక ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడారు. కేటీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి తోడుదొంగల్లా బీజేపీపై రాజకీయ ఎదురుదాడి చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీకి బినామీగా, తోక పార్టీగా మారిందని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి కౌంట్డౌన్ ప్రారంభమైందన్న లక్ష్మణ్ ఎక్కడ బిజెపి బలపడుతుందోననే భయంతో తెలంగాణ ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్తోపాటు పలువురు స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీలో చేరారు.వివేక్ సైతం అటు టిఆర్ఎస్ నుండి, ఇటు కాంగ్రెస్ నుండి అసంతృప్తులను బిజెపిలో చేర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు..