అధికారం చేపట్టి గట్టిగా రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అవినీతి మరకలు అంటుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో తెదేపా అవినీతి పార్టీయని,రాష్ట్రాన్ని ప్రజలను దోచుకుందని తాము అధికారంలోకి వస్తే అవినీతి రహిత సరికొత్త పాలన అందిస్తామంటూ గద్దెనెక్కిన వైసీపీ కూడా తెదేపాకు ఏమాత్రం తీసిపోననే రీతిలో అవినీతి,అక్రమాలకు పాల్పడుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు సైతం అందినకాడికి దోచుకుందామనే రీతిలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అవినీతి పాలన అందిస్తానంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్న ఐదు మంది మంత్రులను ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుర్తించారని త్వరలో అవినీతి మరకలు అంటించుకున్న మంత్రులను సాగనంపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఐదు మంత్రుల్లో మహిళ మంత్రి కూడా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.ఎవరూ ఊహించని విధంగా అత్యంత కీలకశాఖ దక్కించుకున్న సదరు మహిళ ఎమ్మెల్యేకు అప్పగించిన కీలకశాఖలో ఆమె భర్త జోక్యం పెరిగిందని దీంతో అధికారులు సైతం బాహాటంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తన సొంత జిల్లాకు అంతా తనే పెద్ద అన్నట్టుగా వ్యవహరిస్తున్న ఒక సీనియర్ మంత్రిపై కూడా జగన్ మోహన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం.మరొక మంత్రి గారు… ఏదో పని కోసం ఎవరి నుంచో రెండుకోట్ల రూపాయలకు చేయి చాచారట. మరొక మంత్రి గారేమో…. ఒక విద్యాలయం విషయంలో అక్రమంగా, అవినీతిగా వ్యవహరించాట. ఈ నలుగురు మంత్రులకు వార్నింగ్ ఇవ్వడం కూడా ఇప్పటికే పూర్తయిందట. వారిని హెచ్చరికలతో వదిలిపెట్టకూడదని, సాగనంపడమే మంచిదని సీఎం జగన్ నిర్ణయించారన్న చర్చలు సాగుతున్నాయి.మరోవైపు కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు మండల స్థాయిలో పనులను తమ అనుచరగణానికి అప్పగించారు. ప్రజలు తమ అవసరాలకోసం తన వద్దకు రావద్దంటూ బహిరంగంగానే చెబుతున్నారట. టీడీపీ హయాంలో షాడోలు ఎలా పెత్తనం చేశారో, ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల అనుచరగణం కూడా వసూళ్లకు దిగుతున్నారట. కోడెల పేరిట ముద్రపడిన కే ట్యాక్స్ ఏకంగా టీడీపీను నిలువునా ముంచేసింది. ఇప్పుడు అదేబాటలో వైసీపీ నేతలు కూడా.. రాజన్న రాజ్యంలో అన్నీ ఉచితం అంటూనే చాటుమాటుగా వసూళ్లకు శ్రీకారం చుట్టడం జగన్ దృష్టి వరకూ చేరిందట. కొందరు ఎమ్మెల్యేలు మరింతగా చెలరేగటంపై మందలించారని కూడా తెలుస్తోంది.ఇకపోతే మంత్రులు కళ్లెదుట లక్షలు వచ్చే మార్గం కనిపిస్తున్నా.. ఏం చేయలేక నిస్సహాయంగా ఉన్నారట. ఒకరిద్దరు మంత్రలు,ఎమ్మెల్యేలు అధికారుల బదిలీలు,పదోన్నతులకు సంబంధించి అధికారుల నుంచి తీసుకున్నలంచం సొమ్మను కూడా జగన్ తానే స్వయంగా వారికి ఇప్పించారంటూ వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. మహిళ, రైతు వర్గాల్లో జగన్ పాజిటివ్ గా ఉన్నా.. గ్రామాల్లో కక్షలు, పగలు, ప్రతీకార దాడులు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసే అవకాశాలున్నాయంటూ పార్టీవర్గాలు మధనపడుతున్నాయి.అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న మంత్రుల అంశంలో ఏంచేయాలో ముఖ్యమంత్రికి అంతుచిక్కకుండా తయారైనట్టు చర్చ జరుగుతోంది.ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రులపై చర్యలు తీసుకుంటే ప్రపంచానికి మొత్తం తెలిసిపోతుంది.. చర్యలు తీసుకోకుంటే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. ఏంచేయాలో తెలియని అయోమయంలో ఉన్నప్పటికీ చివరకు అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నమంత్రులపై వేటువేస్తేనే మంచిదనే తుది నిర్ణయానికి సీఎం వచ్చినట్టు తెలుస్తోంది.