హోసూరు : ఇక్కడికి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు రైతు తలపై బండ రాయి వేసి దారుణంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కృష్ణగిరి జిల్లా సూలగిరి సమీపంలోని సాధేపురం గ్రామానికి చెందిన రైతు నారాయణప్ప(48) సోమవారం రాత్రి తన పొలంలో సాగు చేసిన టమోటా పంటకు కాపలాగా వెళ్ళాడు. మంగళవారం ఉదయం ఎంతసేపైనా ఆయన ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లారు. అక్కడ గుడిసెలో రక్తపు మడుగులో శవమై కనిపించాడు. గుర్తు తెలియని వ్యక్తులు నారాయణప్ప తలపై బండ రాయి వేసి దారుణంగా హత్య చేసి పరారయ్యారు. ఈ సంఘటనపై సూలగిరి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.