ఈనెల 14వ తేదీన క్రికెట్ మక్కాగా పిలుచుకునే లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్-న్యూజీలాండ్ జట్ల మధ్య ఐసీసీ ప్రపంచకప్ టోర్నీ ఫైనల్ ఆద్యంతం ఆసక్తిగా,ఉత్కంఠగా జరిగిన విషయం తెలిసిందే.మ్యాచ్ చివరి బంతి వరకు ఇరు జట్లతో దోబూచులాడిన విజయం నాటకీయ పరిణామాలతో ఇంగ్లండ్ జట్టును వరించిన విషయం తెలిసిందే.ఇరు జట్ల పరుగులు సమం కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించగా అక్కడ కూడా పరుగులు సమం కావడంతో ఎక్కువ బౌండరీలు బాదారనే నియమంతో ఐసీసీ ఇంగ్లండ్ను విజేతగా ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే దీనిపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు,ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.తాజాగా ఇంగ్లండ్ జట్టు సారథి ఇయాన్ మోర్గాన్ సైతం ఫలితంపై కొంత అసంతృప్తిని వ్యక్తం చేశాడు.ఫైనల్ ఫలితం తమకు కూడా కష్టంగానే అనిపించిందని మోర్గాన్ పేర్కొన్నాడు. మ్యాచ్ విజేతను ఈ విధంగా నిర్ణయించడం సరైంది కాదని పేర్కొన్నాడు. ఇరు జట్ల స్కోరు సమమైనప్పుడు.. ఇలా బౌండరీల నిబంధన ప్రకారం మ్యాచ్ ఫలితాన్ని తేల్చడం తన దృష్టిలో సరైంది కాదని మోర్గాన్ తేల్చి చెప్పాడు. దీనిపై మోర్గాన్ మాట్లాడుతూ “ఇరు జట్లు సమంగా పోరాడిన సమయంలో ఇలాంటి ఫలితాన్ని ప్రకటించడం నాకు సమంజసంగా అనిపించలేదు” అని అన్నాడు. “నేను ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగిన విషయం నిజమే.. ఎక్కడ మేం గెలిచామో.. ఎక్కడ ఓడామో నేను చెప్పలేను. ఇలా గెలువడం మంచిదని నేను అనుకోను. ఈ తరహా ఓటమిని ఎవరు జీర్ణించుకోలేరు” అని ఇయాన్ మోర్గాన్ తెలిపాడు. దీనిపై అనంతరం కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్తో అనేక సార్లు మాట్లాడానని చెప్పాడు. అయితే, ఇది ఎలా జరిగిందో తమకు ఇప్పటికీ అర్థం కాలేదని, ఈ ఫలితంపై తాము ఓ నిర్ధారణకు రాలేకపోయామని ఇయాన్ మోర్గాన్ అన్నాడు..