కోల్కతా : బెంగాల్ నాల్గవ దశ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. కూచ్ బెహరా నియోజకవర్గంలో తుపాకుల మోత మోగింది. అక్కడ జరిగిన రెండు వేర్వేరు హింసాత్మక ఘటనల్లో ఐదుగురు చనిపోయారు. సీతల్కుచ్చిలోని ఓ పోలింగ్ బూత్ బయట ఆనంద్బర్మన్ అనే ఓటరును ఆగంతకులు కాల్చి చంపగా..తమపై దాడికి యత్నించారన్న ఆరోపణలపై నలుగుర్ని కేంద్ర బలగాలు కాల్చి చంపాయి. ఈ ఘటన సీతల్ కుచ్చిలోని పతంతులిలో జరిగింది. అయితే బిజెపి, తృణమూల్ నేతల మధ్య గొడవ జరుగుతుండగా కాల్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనపై ఎన్నికల సంఘం నివేదిక కోరింది. ఓటు వేసేందుకు క్యూలో నిలబడ్డ ఆనంద్ బర్మన్ను ఆగంతకులు కాల్చగా..అక్కడిక్కడే మృతి చెందారు. అయితే ఈ ఘటనపై అధికార టిఎంసి, బిజెపి నేతలు వాగ్వాదానికి దిగారు. సీతల్కచ్చిలో జోర్పట్కి ప్రాంతంలో కూడా పోలింగ్ బూత్ 126 వద్ద ఉదయం 11.30 గంటల సమయంలో టిఎంసి, బిజెపి కార్యకర్తలు ఘర్షణలకు పాల్పడ్డారు. 200 మందికి పైగా పోలింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా… భద్రతా దళాలు కాల్పులు జరపడంతో నలుగురు మృతి చెందారు. కాగా, ఈ ఘటనల్లో చనిపోయిన వారంతా తమ మద్దతుదారు లేనంటూ తృణమూల్ ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల కమిషన్, కేంద్ర బలగాలు తీరును ఖండిస్తున్నామని, ఈ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారంతా తమ పార్టీ మద్దతుదారులని, మరో నలుగురు గాయపడ్డారని తృణమూల్ నేత డోలా సేన్ వ్యాఖ్యానించారు. మృతలు కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. బిజెపి ఇటువంటి అరాచకాలను నిలిపివేయాంటూ పేర్కొన్నారు.