ముంబై : ముఖ్యమంత్రి ఉద్ధవ్, గవర్నర్ కోషియారి మధ్య మరోసారి విభేదాలు పొడచూపాయి. గవర్నర్ కోషియారి గురువారం డెహ్రాడూన్ ప్రభుత్వ హెలికాప్టర్లో వెళ్లాలని నిర్ణయించారు. దీనికి ప్రభుత్వం అంగీకరించలేదు. దాదాపు రెండు గంటల పాటు హెలికాప్టర్ కోసం గవర్నర్ అలాగే లాంజ్లో వేచిచూస్తూ కూర్చుండిపోయారు. మరో 15 నిమిషాల తరువాత అధికారులు వచ్చి, ఇంకా అనుమతులు లభించలేదని గవర్నర్కు తెలిపారు. దీంతో ఆయన బాడుగ విమానంలో వెళ్లారు. గవర్నర్ పర్యటన గురించి వారం కిందటే తెలిపినా ప్రభుత్వం వ్యవహరణ తీరు బాగోలేదని గవర్నర్ కార్యాలయ అధికారులు మండి పడ్డారు. ‘ఇలా జరగడం దురదృష్టకరం. గవర్నర్ ఓ రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి. ఇదో చీకటి అధ్యాయం.’’ అని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు.