విజయవాడ: కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో పొత్తులపై సుదీర్ఘ చర్చలు జరిపినట్లు సమాచారం. టీడీపీతో అవగాహన జాతీయ రాజకీయాలకే పరిమితం కావాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రస్థాయిలో పొత్తులు ఉండవని హైకమాండ్ నుంచి సంకేతాలు వచ్చాయని నేతలు చెబుతున్నారు. పొత్తులు లేకుండానే 175 స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక హోదా, విభజన హామీలపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ ప్రకటనతో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పెరిగిందని నేతలు భావిస్తున్నారు. ఏపీలో ఒంటరిగానే పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని నేతలు చెబుతున్నారు. సమావేశం అనంతరం ఏపీ కాంగ్రెస్ ఇన్చార్జి ఊమెన్చాందీ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తామని, ఏఐసీసీ ఆదేశాల మేరకు ఎన్నికల కమిటీలను ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. ఎన్నికల కమిటీలపై ఈవారంలోనే నివేదిక పంపుతామని, ఎన్నికల వ్యూహంపై ఈనెల 31న మరోసారి చర్చిస్తామని ఊమెన్చాందీ తెలిపారు. ఫిబ్రవరిలో 13 జిల్లాల్లో బస్సుయాత్ర నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని, బస్సుయాత్రపై ఈనెల 31న భేటీలో చర్చిస్తామని ఊమెన్చాందీ చెప్పారు.