దిల్లీ : భారత యువ క్రికెటర్లు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఓ టీవీ షోలో వీరిద్దరూ మహిళలను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కావని కోహ్లీ స్పష్టం చేశాడు. అవి వారి వ్యక్తిగత అభిప్రాయాలని, భారత జట్టుకు వాటితో సంబంధం లేదని తేల్చిచెప్పాడు.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ నేపథ్యంలో కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ వీరి వ్యాఖ్యలపై స్పందించాడు. ‘‘భారత క్రికెట్ జట్టు ఇలాంటి వాటికి మద్దతు పలకదు. బాధ్యత గల క్రికెటర్లమైన మేం అలాంటి వ్యాఖ్యలను సమర్థించం. అవి పూర్తిగా వారి వ్యక్తిగతం. ఈ వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టేవే. అవి సరైనవి కావని ఆ ఇద్దరు ఆటగాళ్లు అర్థం చేసుకుంటారు’’ అని కోహ్లీ అన్నాడు.
పాండ్య, రాహుల్ వన్డే సిరీస్కు అందుబాటులో ఉండే విషయం వారిపై బీసీసీఐ తీసుకునే చర్యలపై ఆధారపడి ఉందని కోహ్లీ తెలిపాడు. బీసీసీఐ తీసుకోబోయే నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని చెప్పాడు. అయితే భారత క్రికెట్ జట్టు ఆలోచన, ఆటపై ఇలాంటివి ప్రభావం చూపించబోవని వెల్లడించాడు. ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొన్నాడు.
ఓ హిందీ టీవీ ఛానల్లో బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్వహించే టాక్ షోలో భాగంగా పాండ్య, రాహుల్ అమ్మాయిలపై చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీసీఐ వీళ్లిద్దరినీ వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది.