అనంతపురం : కార్ల ఉత్పత్తి సంస్థ కియా మరింతగా విస్తరించాలని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ఇప్పటికే ఏటా 70 వేల వాహనాలు ఇక్కడ ఉత్పత్తి అవుతుండగా, సంస్థ మరిన్ని ప్లాంట్లు, విభాగాలు ప్రారంభించాలని సూచించారు. కియా సంస్థ ఏటా మూడు లక్షల వాహనాలు ఉత్పత్తి చేసే సామర్ధ్యానికి చేరాలన్న ఆయన, తద్వారా ఇంకా ఎందరికో ఉపాధి లభిస్తుందని అన్నారు. పెనుకొండలో ఏర్పాటు చేసిన కియా మోటార్స్ మహా వేడుకలకు ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కియా మోటర్స్ ప్లాంట్ను ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో కియా మోటర్స్ చక్కగా పని చేస్తోందని కితాబునిచ్చారు. పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేపడితే ప్రత్యక్షంగా 11 వేల మందికి, పరోక్షంగా మరో ఏడు వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. కియా సంస్థకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని, పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తుందని హామీ ఇచ్చారు. కియా కార్లకు ఇక్కడ మంచి ఆదరణ ఉందన్న సంస్థ ప్రెసిడెంట్, సీఈఓ హాన్ఊపాక్, ఒకేరోజు ఆరు వేలకు పైగా బుకింగ్స్ వచ్చాయని చెప్పారు. భారత్లో దక్షిణ కొరియా రాయబారి షిన్ బాంకిన్, కియా మోటార్స్ ఎండీ కోకిన్షిన్, మంత్రులు బొత్స సత్యనారాయణ, గౌతమ్రెడ్డి, శంకరనారాయణ, జయరాం, ఎంపీలు గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, విప్ కాపు రామచంద్రారెడ్డితో పాటు, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, కియా మోటర్స్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అంతకుముందు పరిశ్రమలోని అన్ని విభాగాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రారంభోత్సవం సందర్భంగా కియా ఫ్యాక్టరీ డాక్యుమెంటరీని ఆయన వీక్షించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృషితో ఏపీలో దక్షిణ కొరియా సంస్థ కియాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్ల పరిశ్రమను రూ.13,500 కోట్ల వ్యయంతో నెలకొల్పారు.