న్యూ ఢిల్లీ:‘దేశ ప్రధాని నరేంద్ర మోదీ బలహీనమైన వ్యక్తి. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్కు భయపడుతున్నార’ని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా మరోసారి అడ్డుకోవటం గురించి రాహుల్ గాంధీ ట్విట్టర్లో స్పందించారు. ‘బలహీనమైన మోదీ షీ జిన్పింగ్కు భయ పడుతున్నారు. భారత ప్రయత్నాన్ని చైనా అడ్డుకుంటే మోదీ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. చైనాతో నమో (నరేంద్ర మోదీ) దౌత్య సంబంధం ఎలా ఉంటుందంటే.. మోదీ జిన్పింగ్తో కలిసి గుజరాత్లో పర్యటిస్తారు. ఢిల్లీలో జిన్ పింగ్ను కౌగిలించు కుంటారు. చైనాలో జిన్పింగ్ ముందు తలవంచుతారు’ అని ఎద్దేవా చేసారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షల సమితి ప్రకారం మసూద్ను అంత ర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఫ్రాన్స్, యూకే, అమెరికాలు ఫిబ్రవరి 27న ప్రతిపాదించాయి. దీనిపై ఏమైనా అభ్యంతరాలుంటే సభ్య దేశాలు పది పని దినాల్లోగా లేవ నెత్తాలి. ఈ గడువు బుధవారం ముగి సింది. చివరి క్షణంలో సాంకేతిక కారణాల సాకుతో ఆ ప్రతిపాదనను చైనా ఆక్షేపించటంతో అది వీగి పోయింది. ఐక్యరాజ్య సమితిలో ఇలాంటి ప్రయత్నాలు చేయడం పదేళ్ల కాలంలో ఇది నాలుగో సారి.